Monday, 29 August 2016

గోన బుద్ధారెడ్డిచే రచింపబడిన రంగనాథరామయణములొని "విశ్వామిత్ర యజ్ఞరక్షణము"

నంత రాఘవుండు విశ్వామిత్రుంజూచి
సంతసంబున: "మునీశ్వర!మీరు నేడు
యాగ దీక్ష వహింపుడనుమానముడిగి;
యాగశత్రుల నెల్ల నడచెద నేను."
అనిన హర్షించి విశ్వామిత్రమౌని
మునుల రప్పించి  యిమ్ముల దీక్ష వడసి
యాగవేదులు మునులర్థిం గావింప
యాగాంగములు పూర్ణమై వేది యొప్పె.
నంచితాజ్యాహుతు లందంద దొరుగ
మించి యగ్నులుమండిమింటికిం బ్రాంక;
హోమాగ్నింబ్రభవించు నున్నతధ్వనులు,
సామాదివేద ప్రసంగఘోషములు,
నాతత దేవతాహ్వాన రావములు,
హోతలపుణ్యమంత్రోరునాదములు
దిక్కులెల్లను నిండి తివిఱి ఘోషింప;
నక్కజంబై యాగమటు చెల్లుచుండ
రామచంద్రుండు ధనుర్ధరుండు దానగుచు
సౌమిత్రియును దాను జాగరూకతను
రక్కసుల్ వచ్చుమార్గము మున్నె యెఱింగి
యక్కౌశికుని మౌనియై యున్నవాని
విస్వమంతయుందమోవృతము గాకుండ
శశ్వత్ప్రభలంగాచుచంద్రార్కు లనంగ
గాచిరి కంతికిం గనుఱెప్ప కరణి
నేచినభక్తి నయ్యెడ నైదునాళ్లు
అలుకమైంగవగూడి యా మరునాండు
బలిమి మారీచ సుబాహు లేతెంచి
మేలిఖడ్గద్యుతుల్ మెఱుంగులు గాంగం
గ్రాలు కాలంబుదోత్కరములో యనంగ
బలములుందారు నుద్భటవృత్తి  మింట
నిలిచి గర్జనములు నిగుడిచి మించి
వదలక యయ్యజ్ఞ వాటంబులోన
మదమున నుప్పొంగి మాంసరక్తములు
గురియుచో హోతలకోలాహంబులు
గరిమ సదస్యుల కలకలధ్వనియుం,
బరిచారకుల దీనభాషణధ్వనియుం
బరికించి విని రామ భద్రుండు వొంగి;




"లక్ష్మణ!చూడు నా లా."వంచు విజయ
లక్ష్మీధనుర్ఘోష లక్షణం బెసగ
నెలకొని వినువీధి నిజదృష్తి నిలిపి
బలువిడి వాయవ్యబాణ మేయుతయు
నురువడి మారీచు నువ్వెత్తుగాంగ
సరభసవృత్తిమై శతయోజనములు
గొనిపోయి యఱిముఱింగ్రూరరాక్షసుని
వనధిలోపలం బాణవైచె నాశరము;
అడరి వజ్రమునకు నలికి యంభోధిం
బడిన మైనాకమై పడినయయ్యసుర
యొకరీతి దరించేరి యుగ్రాంశుకులుని
యకలంకవిక్రమం బందంద పొగడి
దనుజులం బాసి యాతత నిష్థతోడ
ననయంబు నాసుచంద్రాశ్రమభూమి
శూరత విడిచి యాసురవృత్తి నడిచి
ఘోర తపంబుంగైకొని సేయుచుండె.
నఱిముఱి రఘురాముండగ్నిబాణమున
నుఱక సుబాహుని నురమేసి చంపెం.
దక్కిన రాక్షస దళముల నొకటం
జక్కాడె మానవశరమహత్వమున.
సురలు మోదించి యచ్చోబుష్పవృష్తిం
గురుసిరి;మునికోతిగొనియాడె నతని.
నతినిష్థ వెలయ విశ్వామిత్రమౌని
గ్రతుకర్మమంతయుం గడతేర్చి వచ్చి
"నెలకొని రఘురామ, నీ ప్రసాదమునం
గలంగక చెల్లింపంగంతి నీ క్రతువు
నతిక్రుతార్థుండైతి." నని కౌంగిలించి
యతని దీవించి సమ్యమియు హర్షించె
మరునండు రామలక్ష్మను లిరువురును
నఱలేని మైత్రి విశ్వామిత్రుంజూచి
"యింక నెయ్యదికార్యమెఱింగింపు;నీకు
గింకరులం;నీదు క్రుపకుంబాత్రులము."
అనిన నచ్చతిమౌనులందఱు గాధి
తనయు మున్నిడికొని తా మిట్టులనిరి.

Saturday, 20 August 2016

రామాయణంలో లక్ష్మణ రేఖ ఉందా ? లేదా?

మారీచుడు "హే లక్ష్మణ.... హే సీత..." అని రాముని అనుకరించుచూ అరిచిన అరుపులు రామునివిగ తలచి వగచుచూ, రాముడు బంగారు లేడి కోసం వెల్లి ఆపదలలో చిక్కుకున్నాడని తలచి, సీతాదేవి లక్ష్మణని పరుష వాక్యములతో నిందించెను.

తతస్తు సీతాం అభివాద్య లక్ష్మణః  కృతాంజలి కించిదభిప్రణమ్యచ ||
అన్వీక్షమాణొ బహిశశ్చ మైథిలీం జగామ రామస్య సమీపమాత్మవాన్ ||

భావము: సీతాదేవి మొండివైఖరికిని, ఆమె పలికిన తీవ్రవచనములకును నొచ్చుకొనిన లక్ష్మణుడు దోసిలియొగ్గినవాడై, ఒక ప్రక్కగ నిలడి ఆమెకు నమస్కరించెను. పిమ్మట "ఈమెను ఇచ్చట ఒంటరిగ విడిచివెల్లుట ఎట్లు ?' అను తడబాటుతో ఆమె వైపు చూచుచు , మనస్సును దిటవు చేసికొని, శ్రీరాముని సమీపమునకు బయలుదెరెను.

తయా పరుషముక్తస్తు కుపితో రాఘవానుజః |
స వికాంక్షన్ భృశం రామం ప్రతస్థే నచిరాదివ ||

భావము: సీతాదేవి పరుషవచనములకు లక్ష్మణుడు మిగుల కలతచెందెను. సీతను ఒంటరిగా విడిచి వెల్లుటకు కాళ్ళాడకున్నను అన్నను త్వరగా చేరుటకై వెంటనే అతడు ఆశ్రమమును విడిచి బయలుదేరెను.

తదాసాద్య దశగ్రీవః క్షిప్రం అంతరమాస్థితః |
అభిచక్రామ వైదీహీం  పరివ్రాజకరూపదృత్ ||

భావము : తగిన అవకాశముకొఱకు ఎదురుచూచున్న దశగ్రీవుడైన రావణుడు, లక్ష్మణస్వామి అటువెల్లుట గమనించి, వెంటనే సన్యాసి వేషములో సీతాదేవి సమక్షమున నిలిచెను .


వరుసగా జరిగిన ఈ వృత్తాంతములో , ఎక్కడ కూడ లక్ష్మణస్వామి రేఖను గీసినట్లుగా వాల్మీకి రామయణములో లేదు.


ఇది ఆ తర్వాత వచ్చిన స్వేచ్చానువాదములలో (రామచరితమానస్, రంగనాధరామయణము ) ఉన్నది. ఉదాహరణకు రంగనాథ రామయణమునుండి స్వీకరింపబడిన ఈ క్రింద పద్యమును చూడండి. పర్ణశాల చుట్టూ 7 గీతలు గీసి అది దాటవద్దని సీతమ్మవారికి చెపుతూ, అది పరులెవరైనా దాటి వచ్చినట్లైతే వారి తల వేయి వ్రక్కలు అవుతుంది అని నిర్ణ్యం చెసి రాముని కలియుటకు లక్ష్మణుడు అడవిలోకి వెళ్ళాడు.



తిరుమల తిరుపతి దేవస్థానంవారి publication రంగనాథరామయణములో  లక్ష్మణరేఖకు సంబంధించిన పద్యములేదు. It is missed or they might have not considered.

మరికొన్ని స్వేచ్చానువాద రామయణ గ్రంధములను పరిశీలించవలసియున్నది.





Saturday, 30 July 2016

రావణుడు తన కుమారుడైన ఇంద్రజిత్తుకు తగిన జాగ్రత్తలు ఎలా తెలిపాడు ?

అశోకవనమును ధ్వంసం చేయుచు హనుమంతుడు చెప్పిన పరిచయ మరియు హెచ్చరికల సమూహ శ్లోకములు [రామాయణ జయ మంత్రం]  :

జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః
రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః |
దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః
హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః ||

న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్
శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః |
అర్ధయిత్వా పురీం లంకామభివాద్య చ మైథిలీం
సమృద్ధార్ధో గమిష్యామి మిషతాం సర్వరక్షసామ్ |


భావము: 
మహాబలసంపన్నుడైన శ్రీరామునకు జయము. మిక్కిలి పరాక్రమశాలియైన లక్ష్మణునకు జయము. రాఘవుని ఆజ్ఞను పాలించు  కిష్కింధకు ప్రభువైన సుగ్రీవునకు జయము,అసహాయ శూరుడు,కోసల దేశ ప్రభువు ఐన శ్రీ రామ దాసుడను ,వాయు పుత్రుడను ఐన నా పేరు హనుమంతుడు.మరియు శత్రు సైన్యములను రూపు మాపు వాడను,వేయి మంది రావణులైనను యుద్ధమునెదిరించి నిలువజాలరు.వేల కొలది శిలలతోను,వౄక్షములతోను,సకల రాక్షసులను, లంకాపురిని  నాశనమొనర్చెదను.రాక్షసులందరు ఏమి చేయలేక చూచుచుందురు గాక.నేను వచ్చిన పనిని ముగించుకొని,సీతా దేవి కి నమస్కరించి వెళ్లెదను.


పై శ్లోకములు ఆణి ముత్యములవంటివి.ఇందులో హనుమంతుడు తన గురించి ఎంత గొప్పగా చెప్పాడో కదా!రామ లక్ష్మణుల పరాక్రమము,సుగ్రీవుని ప్రభువు గా చెప్పితాను రాముని దాసుడిని అన్నాడు.మరి దాసుడిని వేయి మంది రావణులే ఏమీ చేయలేకపోతె అతని రాజుని ఎదిరించగలరా? లేరు కదా! అందువల్ల ఏమి చేయాలో తెలియక రాక్షసులు నిశ్చేష్టులవుతారు అని భావము.పైగా సీతా దేవిని తీసుకుని వెళతాను అని అనలేదు,నమస్కరించి వెళతాను అన్నాడు,అంటే  తిరిగి మరల రాముని తో కలసి యుద్ధానికి వస్తానని అర్థమేమో!!!

 ఇక్కడ ఇంకొక ఆసక్తికరమైన అంశం.రాళ్లతో,వృక్షములతో యుద్ధం చేస్తాను అన్నాడు.అంటే  దగ్గరగా వున్నా(వృక్షంతో) కొడతాడు.దూరంగా వున్నా(శిలతో) కొడతాడు.

చాలా సైన్యము,గొప్ప యొధులు మరియు రావణ పుత్రుడైన అక్ష కుమారుడు హతమారిన తర్వాత రావణుడు తన కుమారునికి చెప్పిన హితోపదేశం పరికించండి.

నిహతాః కింకరాస్సర్వే జంబుమాలీ చ రాక్షసః|
అమాత్యపుత్రా వీరాశ్చ పంచసేనాగ్రయాయినః|
బలాని సుసమృద్ధాని సాశ్వ నాగ రథాని చ |
సహాదారస్తే దయితః కుమారోక్షశ్చ సూదితః|
నహి తేష్వెవ మే సారూయస్త్వయ్యదినిఘాదన|

భావము: 8000 మంది కింకరులను,జంబుమాలిని,వీరులైన అమాత్య పుత్రులు 7 గురిని,సేనానాయకులు 5 గురిని రణరంగమున చంపబడితిరి. అసంఖ్యాకముగా నున్న అశ్వములు,గజములు,రథములు,పదాతి బలములు కధన రంగమున ప్రాణములు కోల్పోయెను.నీ అనంగు తమ్ముడైన అక్ష కుమారుడు కూడ నిహతుడయ్యెను. అంత ఓ అరిమర్దనా| నాకు నీపై వున్నంత గట్టి నమ్మకము వారిపై లేదు.
 
వివరణ: ఇక్కడ చనిపోయిన వారి లెక్కను క్రోడీకరించి చెప్పి,ఇంద్రజిత్తు శక్తి పై అపార నమ్మకముందని చెపుతూ తండ్రి గా ముందు జాగ్రత్తలు రావణాసురుడు ఏ విధంగా చెప్పాడో చూడండి|

 ఇదంహి ద్రుష్త్వా నిహతం మహద్బలం
 కపేః ప్రభావం చ పరాక్రమం చ|                                    
 త్వమాత్మ నశ్చాపి సమీక్ష్య సారం
 కురుష్వ వేగం స్వబలానురూపం|

భావము: ఆ వానరుని ప్రశస్తమైన బుద్ధి కౌశలమును,శారిరక బలమును,ప్రభావమును,పరాక్రమమును దృష్టిలోనుంచుకొని,నీ బల పరాక్రమములను గూడ చూచుకొని, నీ శక్తియుక్తులకు తగినట్లుగా విజృభింపుము.

వివరణ: యీ సందర్భములో రావణుడుకు శత్రువు యొక్క శక్తియుక్తులను బేరీజు వేస్తూ తన కుమారుని శక్తిని సింహావలోకనం చేసుకొని యుద్ధం చేయమని సూచిస్తున్నారు.

 బలావమర్దస్త్వయి సన్నిక్రుష్టీ
 యధాగతే శామ్యతి శాంత శత్రౌ|
 తధా సమీక్ష్యాత్మ బలం పరం చ
 సమార భస్వాస్త్ర విదాం వరిష్థ|

భావము: అస్త్రవిదులలో శ్రేష్టుడా| నీ నిరుపమాన బల పరాక్రమములు చూచిన వెంటనే శత్రువులు లొంగిపోవుదురు.అట్టి నీవు ఆ వానరుని సమీపించినప్పుడు నీ బలమును,శత్రు బలమును సమీక్షించుకొని,మన సేనలు నశింపకుండునట్టుగా ప్రయత్నము చేయుము.

వివరణ: యిక్కడ రాజుగా స్పష్టమైన ఆదేశము యిచ్చాడు రావణుదు.అది యేమిటంటే యిక పై తమ సైన్యము  నష్ట పోకుండా శత్రు బంధనం జరగాలి.

న వీరసేనా గణశోచ్యవంతి
న వజ్ర మాదాయ విశాల సారం|
న మారుతస్యాస్య గతేః ప్రమాణం
న చాగ్ని కల్పః కరణేన హంతుం

భావము: ఓ వీరుడా| ఒకే దెబ్బతో పెక్కు మందిని హతమార్చగల ఆ వానరుని నుండి సేనలు మనలను రక్షింపజాలవు.తీక్షణమైన వజ్రాయుధము ఆయన వద్ద పనికి రాదు.ఈ వానరుని వేగము,బలము వాయువునకు లేదు.పైగా అతను అగ్నితుల్యుడు.

వివరణ: ఇక్కడ రావణుడు ఎంత అద్భుతంగా హనుమంతుని శక్తిని స్పష్టంగా గుర్తించి ఏమి చేయవద్దో కుమారునికి ఎంత చక్కగా చెప్పాడో చూడండి|

హనుమంతుడు పిడికిలి పోట్లతో,వృక్షాలతో,శిలలతో చాలా సైన్యాన్ని నష్టం చేశాడు.కాబట్టి సైన్యాన్ని తీసుకెళ్ళటం వృధా అన్నాడు.హనుమంతుడు వాయు వేగం తో  కదులుతూ శత్రువులను హతమారుస్తున్నాడు.వజ్రాయుధం తో దగ్గరికెళ్ళి కొట్టబోతే,హనుమంతుడు వాయు వేగి కనుక అది తీసుకొని తిరిగి ఇంద్ర జిత్తు నే చంప గలడు అని హెచ్చరిక.ముష్టి యుద్ధం లో ఆరి తేరిన హనుమంతుని  దగ్గరికి అదే యుద్ధ రీతిన జయించలేము కావున అందుకు ఒడికట్టవద్దు అనేది మరో హెచ్చరిక.

త్వమేవ మర్ధం ప్రసమీక్ష్య సమ్యక్
స్వ కర్మ సామ్యార్ది సమాహితాత్మా|
స్మరంశ్చ దివ్యం ధనుషోస్త్ర వీర్యం
వ్రజౌ క్షతం కర్మ సమారభస్వ|

న ఖల్వియం మతిశ్రేష్టాయత్వాం సంప్రేషయామ్యహం|
ఇయం చ రాజధర్మాణాం క్షత్రస్య చ మతిర్మతా

భావము: నీవు  శత్రువును జయించుటకై  ఏకాగ్ర చిత్తుడవై  ధనుర్విద్యకు సంబందించిన బ్రహ్మాస్త్రాది బలమును జ్ఞప్తికి తెచ్చుకొనుచు వెళ్ళుము.బ్రహ్మాస్త్రమును స్మరించుచు వెళ్ళుము.దానికి తప్ప మరి దేనికి అతను లొంగడు.

బాలుడైన నిన్ను యుద్ధమునకు పంపుట ఉచితముగా లేకున్నా,క్షాత్రధర్మముననుసరించి ఇట్లు చేయుటే యుక్తము. ఏలనన సమర్ధులైన యోధులుండగా రాజు స్వయంగా వెళ్ళుట రాజ ధర్మవిరుద్ధము.

Tuesday, 26 July 2016

Age of Rama during Yajna Samrakshan and at the time of War with Ravana

విశ్వామిత్రుడు శ్రీరాముని యజ్ఞసంరక్షణకు పంపుమని అడుగగా, దశరధుడు పలికిన శ్లోకములో రాముని 16 సం||ల  లోపు వయస్సు కలవాడుగ వర్ణించెను.

 ఊన షొడశవర్షో మే రామో రాజీవలోచనః |
 న యుద్ధ యొగ్యతామస్య పశ్యామి సహరాక్షసైః |

భావము: రాజీవలోచనుడైన నా రాముడు పదునారేండ్ల వయస్సు కూడా నిండని వాడు.కనుక ఇతడు చిఱుతప్రాయమున ఆ క్రూర రాక్షసులతొ యుద్ధము చేయగలడని నేను అనుకొనను.

యజ్ఞసంరక్షణ సమయమున రామలక్ష్మణుల రూపములను వర్ణించు శ్లోకము.

విశ్వామిత్రో యయావగ్రే తతో రామోదనుర్ధరః |
కాకపక్షధరో ధన్వీ తంచ సౌమిత్రి రన్వగాత్ ||

కలపినౌ ధనుష్పాణీ  శోభయనౌ దిశో దవే |
విశ్వామిత్రం మహాత్మానం త్రిశీర్షవివ పన్నగౌ ||

భావము:
విశ్వామిత్రుడు ముందుకు సాగిపొవుచుండగ జులపాలజుట్టుగల శ్రీరాముడు ధనుర్ధారియై అయనను అనుసరించెను. లక్ష్మణుడు ధనువును చేబట్టి రాముని వెంట నడిచెను.

ఆ రామలక్ష్మణులు అమ్ముల పొదులను, ధనస్సులను ధరించి, తమ తమ శోభలతొ అన్ని దిక్కులకు వెలుగులను విరజిమ్ము చుండిరి. అటునిటు తూణీరములను, ధనస్సును దాల్చి వారు మూడు తలల పాము వలె భాసిల్లుచుండిరి.

దీనినిబట్టి యజ్ఞసంరక్షణ సమయమునకు రాములవారు జులపాలజుట్టుగలవాడు, రాజీవలోచనుడు, 16 సం|| లొపు వయస్సు కలవాడూ అని తెలుసుకోవలెను.


ఆశోకవనములో హనుమంతునితో సంభాషించు సమయమున సీతమ్మ తల్లి , తమ పెళ్ళి తర్వత 12 సం||లు అయోధ్య అంతఃపురములో గడిపినట్లుగా  తెలిపినది.

సమా ద్వాదశ తత్రాహం రాఘవశ్య వివేశనే |
భుంజానా మానుషాన్ భోగాన్ సర్వకామసమృద్ధినీ ||

భావము: నేను అయోధ్యలొ శ్రీరాముని అంతఃపురమున ఏ లోటు లేనిదాననై, సమస్త మానవ భోగములను అనుభవించుచు 12సం||లు గడిపితిని.

దీనినిబట్టి వివహసమయానికి శ్రీరాముని వయస్సు 16సం||లు , అరణ్యవాసము  మొదలయ్యెనాటికి 28 సం||లు , అరణ్యవాసం చివరలో యుద్ధం జరిగింది కావున, 28కి 14 కలిపితే 42సం||లు; అంటే శ్రీరాములవారి వయస్సు రావణునితో యుద్ధ సమయనికి సుమారుగ  42సం||లు అని తెలుస్తోంది. 

Saturday, 6 February 2016

Pradhama Slokam

వాల్మికి మహర్షి చూచుచుండగనే క్రూరాత్ముడైన కిరాతకుడు, అన్యోన్యముగ ఉన్న క్రౌంచ పక్షుల జంటలొ, మగ పక్షిని తన బాణముతో కొట్టెను.నెత్తురొడుతున్న తలతో విలవిలలాడుతున్న మగ క్రౌంచ పక్షిని చూసి క్రౌంచి ఏడవసాగెను. జాలిగొలిపె ఆ క్రౌంచ పక్షుల దురవస్థను చూసి, కటిక కసాయితనము అధర్మము అని భావించి ఇట్లు పలికెను.

వాల్మికి మహర్షి :
మా నిషాద ప్రతిష్ఠాం త్వ|  మగమః శాశ్వతీః సమాః ||
యత్ క్రౌంచమిధునాదేకం| అవధీః కామమోహితం ||
{ భావము: ఓ కిరాతుడ క్రౌంచ పక్షుల జంటలొ కామపరవశమైయున్న ఒక పక్షిని చంపితివి. నీవు శాశ్వతముగ అపకీర్తి పాలగుదువు }

నేను పలికిన మాటల సమూహము సమానాక్షరములుగల నాలుగు పాదములతొ ఒప్పుచున్నది. లయబద్దమై వాద్యయుక్తముగ గానము చెయుటకు  తగియున్నది. కనుక ఇది చందోబద్దమైన శ్లొకమే.
{  పాదబద్ధో క్షరసమః  | తంత్రీలయ సమన్వితః   ||
   శోకార్తస్య ప్రవృత్తో మే | శ్లొకో భవతు నన్యథః ||  }

శ్రీమద్రామాయణమునకు  ఇది నాంది శ్లోకము. ఈ శ్లోకము నందు  రామాయణము ఏడుకాండల కధాంశము సుచించబడుచున్నట్లు పండితులు విశ్లేషించుదురు...

[ క్రౌంచ పక్షి అంటే బహుశా ఈనాటి కొంగలు (Crane) అయిఉండవచ్చు.]
[ https://archive.org/details/Krauncha-BirdsOfTheRamayana ]
[http://hindudharmaforums.com/showthread.php?10788-What-s-a-Krauncha-Bird ]

మహర్షి తన శిష్యునితోగూడి, అశ్రమమున ప్రవేశించి దేవపుజాదికధర్మములను నిర్వర్తించెను. సృష్ఠికర్త చతుర్ముఖ బ్రహ్మ వాల్మీకి మహర్షి అశ్రమమునకు విచ్చెసెను.

వాల్మీకి మహర్షి బ్రహ్మ దేవునికు అంజలి ఘటించి; పాద్యమును, అర్ఘ్యమును సమర్పించి, అయనను సుఖాసీనుని గావించి స్థుతించెను.

త మువాచ తతో బ్రహ్మా ప్రహసన్ మునిపుంగవం |
శ్లోక ఏవ త్వయా బద్దో నాత్ర కార్యా విచరణా ||

మచ్చందాదేవ  తే బ్రహ్మన్ ప్రవృత్తేయం  సరస్వతీ |
రామస్య చరితం సర్వం కురు త్వం ఋషిసత్తమ ||

ధర్మాత్త్మనో గుణవతో లోకే రామస్య ధీమతః |
వృత్తం కధయ ధీరస్య యధా తే నారదాచ్చ్రుతం ||

భావము :
బ్రహ్మ చిరునవ్వు నవ్వుచు ఆ మహర్షితో ఇలా పలికెను.

నీవు కనికరముతో పలికిన పలుకులు చంధోబద్దమైన శ్లోకమే. ఈ విషయమున విచారించవలసిన పనిలేదు. ఓ బ్రాహ్మణోత్తమా నీ వాక్కు న సంకల్ప ప్రకారమే జరిగినది.

శ్రీరాముడు ధర్మాత్ముడు, గుణవంతుడు, ధీరుడు, లోకమున ఖ్యాతికెక్కినవాడు.
ఓ ఋషీశ్వరా! నీవు శ్రీరామచరితమును  నారదుడు నీకు తెలిపిన ప్రకారము వర్ణింపుము.

ఈ విధముగా పలికి బ్రహ్మదేవుడు అంతర్ధానమయ్యెను.